కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మొదటి సారి కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party)పై స్పందించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న జనసేన సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాక్రోచ్ పార్టీని చూస్తుంటే సుమతీ శతకంలోని ఓ పద్యం గుర్తుకు వస్తుందంటూ పవన్ చెప్పారు. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ అన్నట్లుగా దేశంలో కాక్రోచ్ పార్టీ వ్యవహారం నడుస్తోందన్నారు. దేశంలో సమగ్రతను అర్థం చేసుకోలేని చిన్న చిన్న ఆలోచనలతో ఉండే వ్యక్తులే ఇలా సమూహంగా ఏర్పడి విభజన వాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. దేశాన్ని బలి చేసేందుకు ఇలాంటి వ్యక్తులు సిద్ధంగా ఉన్నారని, అలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల ప్రవాహంలో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు. అయితే చిన్న చిన్న ఆలోచనలు ఉన్న ఇలాంటి వ్యక్తులు కోట్లాది సంఖ్యల్లో ఏకమైతే బలమైన ప్రభావాన్ని సృష్టిస్తారని చెప్పారు. ఇలా విభజన వాదాన్ని సృష్టించే వారి కార్యక్రమాల్లో ఎవరూ భాగస్వాములు కావొద్దని పవన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం ఐక్యంగా నిలబడి ఇలాంటి కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు.

