కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఆకాశ ఎయిర్ (Akasa Air) విమానంలో ప్రయాణికులను, సిబ్బందిని ఓ ఘటన ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. విమానం గాల్లో ఉండగా లావెట్రీ నుంచి పొగ రావడాన్ని గమనించిన సిబ్బంది అప్రమత్తమై తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రయాణికుడు ఏకంగా విమానంలోని లావెట్రీలో బీడీ వెలిగించి దమ్ము కొట్టడం కలకలం రేపింది.
అంతేకాకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలను దాటుకుని సదరు ప్రయాణికుడు తనతో పాటు లైటర్ కూడా విమానంలోకి తీసుకురావడంతో భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలు ఎదురువుతున్నాయి. విమానం గోవాలో ల్యాండ్ అయిన వెంటనే విమానయాన సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తోటి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి, నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

