కలం, వరంగల్ బ్యూరో: పరకాల (Parkal) పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన మౌలిక వసతులతో త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం పరకాలలో ఎమ్మెల్యే అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరకాల ఏరియా ఆసుపత్రి ద్వారా ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ముఖ్యంగా అనస్థీషియా వైద్యుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన అన్ని మందులు ఆసుపత్రిలో నిల్వ ఉంచాలని ఆదేశించారు. గత నెలలో ఆసుపత్రిలో వైద్య పరికరాలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ప్రతి రశీదు, బిల్లు, రికార్డును పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి పనులను సంబంధిత ఏజెన్సీలు వేగవంతంగా పూర్తి చేసి ఆసుపత్రిని త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్ పర్సన్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, ఆర్డీవో డి.ఎస్. వెంకన్న, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

