కలం, వెబ్ డెస్క్: ఏపీ (AP)లో నాలుగు రాజ్యసభ స్థానాలు (Rajya Sabha Seats) ఏకగ్రీవమైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు స్థానాలకు నాలుగే నామినేషన్లు దాఖలు కావడం ఎన్నిక ఏకగ్రీవమైంది. వీరిలో టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, జనసేన నుంచి లింగమనేని రమేష్ ఉన్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల కమిషన్ ఫలితాలను ప్రకటించింది. ఎన్నికకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను నేడు ఆయా సభ్యులు రిటర్నింగ్ అధికారి నుంచి అందుకోనున్నారు.
జూన్ 1న కేంద్ర ఎన్నికల సంఘం ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల స్థానాలు ఉన్నాయి. జూన్ 8 వరకు నామినేషన్లు స్వీకరించి, 9న నామినేషన్ల పరిశీలన చేపట్టారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. వీటిలో ఏపీ, మధ్య ప్రదేశ్లో మొత్తం ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మధ్య ప్రదేశ్లో మొత్తం స్థానాలు బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకోగా, ఏపీలో ఒక మూడు టీడీపీ, ఒకటి జనసేనకు ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 18న మిగతా రాష్ట్రాల్లో స్థానాలకు ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.

