కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS Ramanthapur) యాజమాన్యం మొండివైఖరిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఫీజులను అడ్డగోలుగా పెంచడాన్ని నిరసిస్తూ స్కూల్ గేటు ముందు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. గత నాలుగేళ్ల కాలంలోనే 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 140 శాతం, 6 నుంచి 10వ తరగతి వరకు 84 శాతం మేర ఫీజులు పెంచడం దారుణమని వారు మండిపడ్డారు.
యాజమాన్యం వెంటనే స్పందించి పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. పాఠశాల ప్రిన్సిపల్ స్వయంగా బయటకు వచ్చి తమకు సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో పాఠశాల పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. పెంచిన ఫీజులపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ పోరాటం ఆపేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

