కలం, జనగామ: తెలంగాణ ప్రభుత్వం జూన్ 15వ తేదీ నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని (School Reopening) నిర్ణయించిన నేపథ్యంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సందిగ్ధత నెలకొంది. జూన్ 15 సోమవారం అమావాస్య కావడంతో ఆ రోజున పిల్లలను పాఠశాలలకు పంపేందుకు చాలా మంది తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
సంప్రదాయాలు, కుటుంబ ఆచారాలను దృష్టిలో ఉంచుకుని అమావాస్య రోజున కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం సరికాదని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలల ప్రారంభ తేదీపై మరోసారి పునరాలోచన చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే పాఠశాలల ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే అమావాస్య కారణంగా తొలి రోజు విద్యార్థుల హాజరు శాతం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని విద్యావర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, జూన్ 17న మొహరం పండుగ సెలవు ఉండటంతో పలువురు తల్లిదండ్రులు జూన్ 18వ తేదీ నుంచే తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తల్లిదండ్రుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల పునఃప్రారంభ తేదీని మార్చాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడనుందో వేచి చూడాల్సిందే.

