కలం, వెబ్ డెస్క్ : పాలకుర్తి (Palakurthi) నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో పార్టీ నాయకుల మధ్య నెలకొన్న కుమ్ములాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు పొనుగోటి సోమేశ్వర్ రావు, పంజా కల్పన, జలగం శ్రీనివాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఓటమికి సొంత పార్టీలోని కోవర్టుల కుట్రలే ప్రధాన కారణమని వారు ఆరోపించారు.
ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకులు కాకిరాల హరిప్రసాద్, కిశోర్ రెడ్డిలు బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ను బలహీనపరుస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉంటూనే ఇతర పార్టీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఇటువంటి నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే ఇటువంటి కోవర్టులపై కఠిన చర్యలు తీసుకోవడం అనివార్యమని వారు స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆపబోమని హెచ్చరించడంతో పాలకుర్తి (Palakurthi)రాజకీయం మరింత వేడెక్కింది.

