కలం, వెబ్ డెస్క్ : పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు (PoK protests) తీవ్ర హింసాత్మకంగా మారాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పై అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టాల కింద నిషేధం విధించడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ నిషేధానికి వ్యతిరేకంగా రావాలాకోట్, ముజఫరాబాద్, కోట్లి, భీంబర్, దడ్యాల్, పల్లాంద్రి, సుధ్నోతి వంటి ప్రాంతాలలో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిరసనకారులను అదుపు చేయడానికి పాకిస్తాన్ భద్రతా దళాలు పెల్లెట్ గన్స్, టియర్ గ్యాస్ ఉపయోగించి కాల్పులు జరిపాయి.
ఈ కాల్పుల కారణంగా రావాలాకోట్, పరిసర ప్రాంతాలలో సుమారు 150 మంది వరకు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని స్థానిక వర్గాలు, కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అధికారికంగా 11 మంది మరణించినట్లు ధృవీకరించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మరణాల సంఖ్య 70 నుండి 80 కి పైగానే ఉండవచ్చని స్థానిక సమాచారం ద్వారా తెలుస్తోంది. భద్రతా దళాల క్రూరమైన చర్యలపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ప్రస్తుతం అక్కడ దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి, వ్యాపారాలు నిలిచిపోయాయి. పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం కావాలనే డిమాండ్తో పాటు, కాశ్మీర్ వెలుపల ఉన్న శరణార్థులకు కేటాయించిన అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలని, ద్రవ్యోల్బణం, విద్యుత్ కొరత, నిరుద్యోగం నుండి ఉపశమనం కలిగించాలని, మెరుగైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

