కలం, వెబ్ డెస్క్ : వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని తన నివాసంలో దిగ్గజ దర్శకుడు భారతీరాజా (84) (Bharathiraja ) బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచగా.. ప్రముఖులు భారతీరాజా పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు. కాసేపటి క్రితం తమిళనాడు సీఎం విజయ్ అక్కడకు చేరుకొని నివాళులర్పించారు.
ఈ సమయంలో భారతీరాజా భౌతికకాయాన్ని చూసి సీఎం విజయ్ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. గురువులాంటి వ్యక్తిని కోల్పోవడం తమిళ సినీ ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. ఆయన మరణం కేవలం తమిళ చిత్ర పరిశ్రమకే కాదు.. భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తానికి పెద్ద నష్టమని పేర్కొన్నారు.
మరోవైపు భారతీరాజా మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. భారతీయ చలనచిత్ర రంగం ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రూపొందించిన చిత్రాలు కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, ఎన్నో తరాల వారికి స్ఫూర్తిగా నిలిచాయని గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఆరాధన’ చిత్రంలో నటించే అదృష్టం తనకు దక్కిందని స్మరించుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తను సృష్టించిన అద్భుత చిత్రాల రూపంలో ఎప్పటికీ మన గుండెల్లోనే జీవించే ఉంటారని చెప్పుకొచ్చారు.

