అసెంబ్లీలో డ్రంక్ టెస్ట్ నిర్వహించాలి : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

కలం, వెబ్​ డెస్క్​ : అసెంబ్లీకి ఎవరు తాగి వస్తున్నారో ప్రజలకు తెలియాలని, అందుకే సభలో డ్రంక్ టెస్టుతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ వ్యవహారశైలిపై సంచలన ఆరోపణలు చేసిన ఆయన, గత పదిహేను రోజులుగా తాము ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

కరీంనగర్ సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, 2025 సెప్టెంబర్ నెలలో ఫైరింగ్ రేంజ్ వద్ద సీపీ సతీమణితో పాటు ఆమె ఐదుగురు మిత్రులు కలిసి ఏకే 47, పిస్టళ్లతో సుమారు 160 రౌండ్లు కాల్పులు జరిపారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో బోనాల పల్లికి చెందిన అమృతమ్మ అనే వృద్ధురాలికి బుల్లెట్ తగిలి గాయమైందని, అయితే ఆమె తనకు రాయి తగిలిందని భావించిందని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఆయుధాలు ఇచ్చి కాల్పులు జరిపించడంపై ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కౌశిక్​ రెడ్డి (Kaushik Reddy) డిమాండ్ చేశారు.

పోలీస్ శాఖలో వికాస్ అగర్వాల్ వంటి అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ వాహనాలు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఇటువంటి ఆఫీసర్ల తీరుతో పోలీస్ వ్యవస్థ బ్రష్టు పట్టిపోతోందని అన్నారు. గతంలో తనపై లేఖ రాసిన ఐపీఎస్ అధికారుల సంఘం, ఇప్పుడు జరుగుతున్న ఈ అక్రమాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాను చేస్తున్న ఆరోపణలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తనకు సమాచారం ఇస్తున్న పోలీస్ మిత్రులను బెదిరించవద్దని, సీపీ బెదిరింపులకు తాను భయపడబోనని తెలిపారు. మీకు వందల మంది ఇంటిలిజెన్స్ ఉండొచ్చని, బీఆర్ఎస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తల అండ ఉందని ఆయన పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>