కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆపరేషన్ క్రాక్డౌన్ (Operation Crackdown) ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ వివరాలను వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు వాడుతున్న మ్యూల్ అకౌంట్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే చేపట్టిన ఆపరేషన్ క్రాక్డౌన్లో భాగంగా 137 ప్రత్యేక బృందాలతో రాష్ట్రంలోని సుమారు 500 ప్రాంతాల్లో పోలీసులు ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ ఆపరేషన్ ద్వారా సైబర్ సెక్యూరిటీ విభాగం ఏకంగా 1,888 మ్యూల్ అకౌంట్లను గుర్తించగా, వీటి ద్వారా దాదాపు రూ. 100 కోట్ల వరకు ఆర్థిక నష్టం జరిగినట్లు గుర్తించారు. ఈ అకౌంట్లపై ఇప్పటికే 549 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మొత్తం 626 మంది అనుమానితులను గుర్తించి, వారిలో 208 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల (Cybercrime) కట్టడికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

