విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాకింగ్ న్యూస్

కలం, వెబ్ డెస్క్: విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాకింగ్ న్యూస్ చెప్పింది. గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన ధరలు భారీగా పెరగడంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను పెంచుతున్నట్టు ప్రకటించింది. దశలవారీగా విమాన చార్జీలు పెరగనున్నాయి. ఇంధన ధరల పెరుగుదలతోపాటు భారత్‌లో విమాన టర్బైన్ ఇంధనంపై (ATF) అధిక ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ కారణంగా విమానయాన సంస్థలపై ఖర్చు పెరిగిందని సంస్థ తెలిపింది. ఎయిర్‌లైన్‌ల ఆపరేటింగ్ ఖర్చుల్లో దాదాపు 40 శాతం వాటా ఉన్న ATF ధరలు మార్చి ప్రారంభం నుంచి సరఫరా అంతరాయాల కారణంగా గణనీయంగా పెరిగాయని వెల్లడించింది.

మూడు దశల్లో అమలు

ఫ్యూయల్ సర్‌చార్జ్ పెంపును మూడు దశల్లో అమలు చేస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. మొదటి దశలో భాగంగా మార్చి 12 నుంచి కొత్త బుకింగ్స్‌పై పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి. దేశీయ విమానాలపై రూ.399, SAARC దేశాలపై రూ.399, పశ్చిమ ఆసియా/మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే విమానాలకు 10 అమెరికన్ డాలర్లు, దక్షిణాసియాకు వెళ్లే విమాన సర్వీసులకు 60 డాలర్లు, ఆఫ్రికాకు 90 డాలర్లు చార్జీలు పెరగనున్నాయి.

ఇప్పటి వరకు సింగపూర్ రూట్‌లపై ఫ్యూయల్ సర్‌చార్జ్ లేకపోయినా, ఈ దశ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. మార్చి 18 నుంచి రెండో దశ పెరుగుదల అమల్లోకి రానున్నది.  ఇందులో భాగంగా యూరప్ దేశాలకు వెళ్లే విమానాలపై 125 డాలర్లు, ఉత్తర అమెరికా దేశాలకు 200 డాలర్లు, ఆస్ట్రేలియాకు 200 డాలర్లు సర్ చార్జీలు అమలు చేయనున్నారు. మూడో దశలో భాగంగా హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా వంటి ఫార్ ఈస్ట్ దేశాల రూట్‌లపై ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఇప్పటికే జారీ చేసిన టికెట్లపై ఈ పెంపు వర్తించదని, అయితే ప్రయాణ తేదీలు లేదా మార్గంలో మార్పులు చేస్తే కొత్త ఛార్జీలు వర్తించే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. అలాగే అవసరాన్ని బట్టి ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను సమీక్షిస్తూ తగిన మార్పులు చేస్తామని తెలిపింది. ఎయిర్ ఇండియాతో పాటు మిగిలిన విమాన సంస్థలు కూడా త్వరలో సర్ చార్జీలు పెంచే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>