కలం, వెబ్డెస్క్: అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు ఒకప్పుడు. ఈ ఆన్లైన్ యుగంలో దీన్ని పాలు, పెరుగు, బంగారం, కండోమ్… కాదేదీ కొనడానికి అనర్హం మార్చుకోవచ్చేమో! ఇదేంటీ.. అనుకుంటున్నారా? ఇది ఇన్స్టామార్ట్ (Instamart) ఆర్డర్స్ లిస్ట్. ఇవే కాదు, రూ.10 విలువ చేసే ప్రింటవుట్ నుంచి రూ.లక్షలు విలువ చేసే బంగారం, ఐఫోన్ల వరకు ఈ ఏడాది ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశారని తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. అంతేకాదు, ఒకరు ఏకంగా ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు రూ.22లక్షలు ఇన్స్టామార్ట్లో కొనుగోళ్లకు ఖర్చు చేశాడు! ఇంకొకరు ఏడాదిలో 368 సార్లు కరివేపాకు కోసం ఆర్డర్ చేశాడు! హైదరాబాద్కు చెందిన ఒక వినియోగదారుడు ఒకే రోజు రూ.4.3లక్షల విలువైన 3 ఐఫోన్లు ఆర్డర్ చేశాడు. బాప్.. రే అనుకుంటున్నారా? ఇవే కాదు.. ఇలాంటి వింతలు, విశేషాలు ఎన్నో ఈ ఏడాది ఇన్స్టామార్ట్ తన ఐదవ వార్షిక నివేదిక ‘హౌ ఇండియా ఇన్స్టామార్టెడ్ 2025’లో వెల్లడించింది. అవేంటో మీరూ చదివేయండి.
అత్యల్పం రూ.10.. అత్యధికం రూ.22లక్షలు..:
బెంగళూరులో ఒకరు రూ.10 విలువైన ప్రింటవుట్ ఆర్డర్ చేశాడు. ఇది ఈ ఏడాది ఇన్స్టామార్ట్ (Instamart)లో అత్యంత తక్కువ విలువ కలిగిన ఆర్డర్. అలాగే అత్యధికంగా ఒక వినియోగదారుడు రూ.22లక్షలకు పైగా ఖర్చు చేశాడు. ఇందులో 22 ఐఫోన్ 17లు, బంగారు నాణేలు, ఎయిర్ప్రయర్ వంటివాటితోపాటు పాలు, గుడ్లు, ఐస్క్రీమ్, పండ్లు వంటి రోజువారీ సరుకులూ ఉన్నాయి. ఇక, ఈ ఏడాది సుమారు 26వేల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ నింపేంత పరిమాణంలో పాలు అమ్ముడయ్యాయి. సగటున సెకనుకు 4 పాల ప్యాకెట్లు ఆర్డర్ చేశారు. లేట్ నైట్ ఆర్డర్లలో మసాలా చిప్స్ టాప్లో నిలిచాయి. హైదరాబాద్లో ఒకరు ఒకేసారి మూడు ఐఫోన్ 17లు ఆర్డర్లు చేశాడు. రూ.4.3లక్షలు ఖర్చు పెట్టాడు.
నోయిడాలో ఒక వ్యక్తి బ్లూటూత్ స్పీకర్లు, ఎస్ఎస్డీలు, రోబోటిక్ వ్యాక్యూమ్లపై రూ.2.69లక్షలు ఖర్చు చేశాడు. దీపావళి సందర్భంగా బెంగళూరులో రూ.1.97లక్షల విలువైన 1కిలో వెండి బార్డర్ను ఆర్డర్ చేశారు. ధంతేరాస్ రోజు బంగారం ఆర్డర్లు 2024తో పోలిస్తే 400శాతం పెరిగాయి. పాలు, పెరుగు, గుడ్లు, కరివేపాకు, అరటిపండ్లు తరచూ ఆర్డర్ అయిన వస్తువులుగా నిలిచాయి. కొచ్చిలో ఓ వ్యక్తి ఏడాదిలో 368 సార్లు కరివేపాకు ఆర్డర్ చేశాడు. టిప్పుల విషయంలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఒక వినియోగదారుడు టిప్పులకు రూ.68,600 చెల్లించాడు. చెన్నైలో మరొకరు రూ.59,505లు చెల్లించాడు.
ప్రేమికుల రోజు పూలు.. సెప్టెంబర్లో కండోమ్లు..
ఈ ఏడాది ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ కోసం చేశారు. సెప్టెంబర్లో కండోమ్ ఆర్డర్లు 24 శాతం పెరిగాయి. చెన్నైలో ఓ వినియోగదారు ఒక్కరే 228 కండోమ్ ఆర్డర్లు చేసి రూ.1.06 లక్షలు ఖర్చు చేశాడు. ఇక, ప్రేమికుల దినోత్సవం రోజు నిమిషానికి 666 గులాబీ పూల ఆర్డర్లు వచ్చాయి. బెంగళూరులో నిమిషానికి 1,780 పూలు, చాక్లెట్లు ఆర్డర్ అయ్యాయి. రక్షా బంధన్, ఫ్రెండ్షిప్ డే, వాలెంటైన్స్ డే 2025లో అత్యధిక గిఫ్టింగ్ రోజులుగా నిలిచాయి.
ఈ కొనుగోళ్లు స్పెషల్!
బెంగళూరులో కేవలం నూడుల్స్కు రూ.4.36 లక్షలు, ముంబైలో రెడ్బుల్పై రూ.16.3 లక్షలు, హైదరాబాద్లో గులాబీలపై రూ.31,240 వేలు, చెన్నైలో పెంపుడు జంతువుల సరుకులపై రూ.2.41 లక్షలు, నోయిడాలో ప్రోటీన్ ఉత్పత్తులపై రూ.2.8 లక్షలు, ముంబైలో బంగారంపై రూ.15.16 లక్షలు ఖర్చు చేశారు.
Read Also: ‘సోషల్ వార్’.. జాన్వీకపూర్ వర్సెస్ ధ్రువ్ రాఠీ
Follow Us On: Sharechat


