కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న వేళ.. కివీస్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ (Christopher Luxon) తమ దేశ జట్టుకు ఉత్సాహాన్నిచ్చే సందేశం పంపారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను ఆయన(Christopher Luxon) షేర్ చేశారు. అందులో భారత్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరగడం కంటే మరేదీ గొప్పగా ఉండదని పేర్కొన్నారు. ఫైనల్ వరకు చేరిన తమ జట్టు ఆటగాళ్లను అభినందించిన ఆయన, దేశమంతా వారి వెంటే ఉందని భరోసా ఇచ్చారు. కచ్చితంగా ట్రోఫీ గెలుస్తారనే నమ్మకం తమకు ఉందని, అద్భుత ప్రదర్శన చేయాలని కోరారు.
మరోవైపు కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో తన జట్టు సామర్థ్యంపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ట్రోఫీని గెలిచే క్రమంలో ప్రత్యర్థి అభిమానుల మనసు గాయపడినా తమకు అభ్యంతరం లేదని ఆయన వ్యాఖ్యానించాడు. లక్షకు పైగా భారత్ మద్దతుదారులు ఉండే మైదానంలో ఆడుతున్నా, స్వదేశంలోని కివీస్ ప్రజల మద్దతు తమకు అండగా ఉంటుందని ఆయన అన్నాడు.
సెమీఫైనల్లో ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాదడంతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన కివీస్ ఫైనల్కు దూసుకొచ్చింది. ఐసీసీ ఫైనల్స్లో భారత్, కివీస్ జట్లు తలపడటం ఇది నాలుగోసారి. గతేడాది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించగా, టీ20 ఫార్మాట్ ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీ పడడం మాత్రం ఇదే మొదటిసారి.

