కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణ ( NTR Statue) జరుగనుంది. హైదరాబాద్లోని అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారికంగా ఆవిష్కరించనున్నారు. ఈ చారిత్రాత్మక వేడుక కోసం మైత్రివనం జంక్షన్ను రంగురంగుల విద్యుత్ దీపాలు, భారీ తోరణాలు, పూలమాలలతో అత్యంత వైభవంగా అలంకరించారు. ఫ్లెక్సీలు, భారీ కట్ అవుట్ లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాకతో పాటు నగర నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటంతో నందమూరి అభిమానులు, రాజకీయ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లిహిల్స్ ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి, కళారత్న రాజ్ కుమార్ ఉడయార్ రెండు నెలల పాటు కష్టపడి ఈ కాంస్య విగ్రహన్ని తయారుచేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిన తర్వాత హైదరాబాద్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ తొలి విగ్రహం ఇదే.

