కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad)కు చెందిన ఓ నలుగురు అనాథలపాలిట ఆత్మ బంధువులవుతున్నారు. ఏ దిక్కులేని అనాథల అంత్యక్రియలను దగ్గరుండి స్వచ్ఛందంగా చేస్తున్నారు. నిజామాబాద్లో అనారోగ్యంతో ముగ్గురు గుర్తు తెలియని వృద్ధులు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు ఎవరో కూడా తెలియదు. అనాథలుగా గుర్తించిన పోలీసులు అంత్యక్రియలు నిర్వహించాలని ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థని కోరారు. నిజామాబాద్ దేవి థియేటర్ పక్కన సార్వజనిక్ శ్మశాన వాటికలో అనాథ మృతదేహాలకు యూవీ ఫౌండేషన్తో కలిసి అంత్యక్రియలు జరిపారు.
ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, ఇందురీ శేఖర్, దర్శనం రాజు, క్రిష్ణ, యూవీ ఫౌండేషన్ ప్రతినిధి సతీష్ అనాథ వృద్ధులకు అంత్యక్రియలు (Final Rites) జరిపి మానవత్వం చాటుకున్నారు. అంత్యక్రియలు జరపడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువతను స్థానికులు అభినందించారు.


