కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ మేయర్ స్థానం(Nizamabad Mayor Seat) ఈసారి జనరల్ మహిళ(General Women)లకు రిజర్వ్ అయ్యింది. గత రెండు పర్యాయాలు బీసీ మహిళ(BC Women)కు దక్కగా ఈసారి నిజామాబాద్ స్థానం జనరల్ మహిళలకు కేటాయించారు. గత రెండు పర్యాయాలు కూడా మహిళలు అందులోనూ బీఆర్ఎస్(BRS) పార్టీ వారే ఆకుల సుజాత, నీతూ కిరణ్లు మేయర్లుగా వ్యవహరించారు. ఈసారి కూడా జనరల్ మహిళలకు దక్కడంతో మూడోసారి ముచ్చటగా నిజామాబాద్ మేయర్గా మహిళే పగ్గాలు చేపట్టనున్నారు. వాస్తవానికి కాంగ్రెస్(Congress) తో పాటు బీజేపీ(BJP)లోనూ మేయర్ స్థానం దక్కించుకోవాలని పురుష నేతలు ఆశించారు. ఎలాగైనా మేయర్ రిజర్వేషన్ కలిసి వస్తుందని ఆశ పడ్డారు. చాలా కాలంగా మేయర్ లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. బడా నేతలకు జిల్లా అధ్యక్షులకు ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలో ప్రభావితం అయ్యే నేతలను ప్రసన్నం చేసుకుంటూ వస్తున్నారు. లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా జనరల్ మహిళకు కేటాయించడంతో నేతల ఆశలు కాస్త అడియాశలు అయ్యాయి.
మేయర్ రేసులో ఉన్నది వీరే..
కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ కవితా రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ నుంచి గత ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి రేసులో ఉన్నారు. వ్యాపారవేత్త దినేష్ రెడ్డి భార్య స్రవంతి, సరళ కూడా మేయర్ రేసులో ఉన్నట్టు సమాచారం..
మారిన ముఖచిత్రం.. తగ్గిన పోటీ
నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ స్థానం జనరల్ మహిళలకు కేటాయించడంతో నిజామాబాద్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. హేమాహేమీలు పక్కకు పోయి పోటీ తగ్గింది. అన్ని పార్టీల నుంచి నలుగురైదుగురి కంటే ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో పార్టీల్లో మేయర్ రేస్ పోటీ తగ్గిపోయింది.


