ఉత్తమ అధికారులకు అవార్డులు: కలెక్టర్ కీలక ప్రకటన

కలం, నిజామాబాద్ బ్యూరో : అందరి భాగస్వామ్యంతో నిజామాబాద్ జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నగరంలో 2కే రన్ నిర్వహించారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి చేపట్టిన ఈ పరుగును కలెక్టర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్ జెండా ఊపి ప్రారంభించారు.

కంటేశ్వర్ బైపాస్ నుండి ప్రధాన మార్గాల మీదుగా పాత ఆర్డీఓ కార్యాలయం వరకు 2కే రన్ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మకతను చాటేలా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. అంకితభావం, చిత్తశుద్ధితో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో పాల్గొనే అధికారులు, సిబ్బందిని గుర్తించి ఉత్తమ అవార్డులు అందజేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) ఈ సందర్భంగా వెల్లడించారు.

ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆయా శాఖల వారీగా విస్తృత స్థాయిలో అమలు చేస్తూ నగర అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రగతి ప్రణాళిక ఎంతో చక్కటి కార్యక్రమమని, అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి పేరు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్ విజయ్ కాంత్ రావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>