కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కనే కృష్ణా నది మధ్యలో వెలిసిన చారిత్రాత్మక ‘నిజాం కొండ ఖిల్లా’ ప్రస్తుతం ఎగువ నుండి ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం లేకపోవడంతో పూర్తిగా కళ తప్పింది. సాధారణంగా ముంచెత్తే వర్షాలు, ఎగువ ప్రాజెక్టుల నుండి వచ్చే భారీ వరద నీటితో కృష్ణా నది నిండుగా ప్రవహిస్తున్నప్పుడు, ఈ ఖిల్లా (Nizam Konda Fort) చుట్టూ నీరు చేరి దట్టమైన పచ్చదనంతో ఒక అద్భుతమైన ద్వీపంలా మెరిసిపోయేది. కానీ, ప్రస్తుత సీజన్లో సరైన వరద ప్రవాహం రాకపోవడంతో నది గర్భం పూర్తిగా ఎండిపోయి, మైదానాన్ని తలపిస్తోంది. చుట్టూ నీరు లేకపోవడంతో ఆ పచ్చని కొండ, దానిపై ఉన్న పురాతన కోట గోడలు బోసిపోయి, వెలవెలబోతూ కనిపిస్తున్నాయి.
ప్రయాణికులకు తప్పని నిరాశ..
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు, బీచుపల్లి క్షేత్రానికి వచ్చే భక్తులు నది మధ్యలో జలకళతో ఉట్టిపడే ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఎడారిలా మారిన నదిని, కళ తప్పిన కొండను చూసి పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. ఎగువ నుండి వరద నీరు వచ్చి నది మునుపటిలా ప్రవహిస్తే తప్ప ఈ నిజాం కొండ ఖిల్లాకు ఆ పాత జలకళ వచ్చేలా లేదు.

