కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో జూలై 4వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాల సమన్వయంపై పర్యటన స్థలాన్ని జిల్లా ఎస్పీ డి.జానకి (SP Janaki) పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యటన ప్రాంతంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహన పార్కింగ్, ప్రజల రాకపోకలు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంధ్య, ఆర్ అండ్ బీ అధికారి, జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ సంబంధిత అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

