కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిర్మల్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం (POCSO Court) కీలక తీర్పు వెలువరించింది. కుబీర్ మండలం నిగ్వ గ్రామానికి చెందిన బనెల్లి విఠల్కు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి శ్రీవాణి తీర్పు ప్రకటించారు. 2022లో నిగ్వ గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికకు చాక్లెట్ల ఆశ చూపి అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కుబీర్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. అనంతరం పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి సాక్ష్యాధారాలతో నిందితుడిపై చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడు దోషి అని నిర్ధారిస్తూ 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) మాట్లాడుతూ, చిన్నారులపై నేరాలకు పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. కేసును సమర్థవంతంగా విచారించి, న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్ రెడ్డి, విచారణ అధికారులు సాయి కిరణ్, ఎస్సై షరీఫ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్, లైజన్ ఆఫీసర్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్లను ఎస్పీ అభినందించారు.

