కలం, నిర్మల్: ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ‘మీ ప్రమాణం’ (Mee Pramanam) యాప్ తీసుకురానున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఎస్డీ కమిషనర్ రవికిరణ్తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ, మీ-సేవ, వైద్య, విద్య తదితర శాఖలకు సంబంధించిన 70–80 శాతం సేవలను ‘మీ ప్రమాణం’ యాప్తో అనుసంధానం చేసి, ప్రజలకు ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల హాజరు, పనితీరును పర్యవేక్షించే సమగ్ర డ్యాష్బోర్డ్ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తామన్నారు.
ప్రస్తుతం వివిధ శాఖలు వేర్వేరు యాప్ల ద్వారా ఉద్యోగుల హాజరును నమోదు చేస్తున్న నేపథ్యంలో, అన్ని శాఖల హాజరు వివరాలను ఒకే డ్యాష్బోర్డ్లో సమీకరించి ఉద్యోగుల హాజరు, విధుల నిర్వహణ, పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల హాజరు, పనితీరు పర్యవేక్షణలో నిర్మల్ (Nirmal) జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఈడీఎం నదీమ్, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

