కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియను బీజేపీ ఆయుధంగా మలుచుకొనే అవకాశం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) హెచ్చరించారు. ఈ కార్యక్రమం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సోమవారం వనపర్తి పట్టణంలోని ఆయన గృహంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ, సభ్యత్వ నమోదుపై దిశా నిర్దేశం చేశారు.
బూత్ ఏజెంట్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి
సర్ ప్రక్రియలో భాగంగా బూత్ ఏజెంట్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) పేర్కొన్నారు. కీలకమైన సమయములో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలనీ పిలుపునిచ్చారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లాగానే తెలంగాణలో ఓటర్ జాబితా వారికి అనుకూలంగా చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వలస ఓటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. 316 బూతులలో ఏజెంట్లు ప్రతిరోజు ఓటర్ల వడపోతలో పాల్గొనాలనీ తెలిపారు. 25 జూన్ నుండి 25 జులై వరకు నిర్వహించే ఓటర్ల నమోదులో మార్పులు, చేర్పులు కార్యక్రమంలో కచ్చితంగా పాల్గొనాలని కోరారు.
సభ్యత్వ నమోదులో పాల్గొనండి
సభ్యత్వ నమోదులో నిఖార్సయిన కార్యకర్తలను చేర్పించాలని కోరారు. ప్రతిష్ఠాత్మకంగా పార్టీ చేపట్టబోయే సభ్యత్వ నమోదులో నాయకులు కార్యకర్తలు విధిగా పాల్గొనాలన్నారు. బూత్ ఏజెంట్లకు, సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసే నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామనీ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

