కలం, కరీంనగర్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా బుధవారం కరీంనగర్ (Karimnagar) డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం (MLA Medipalli Satyam) హాజరయ్యారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తదితరులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అతి చిన్న వయసులో శాసనసభకు ఎన్నికై మంత్రిగా ప్రదేశ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎన్నో సేవలు చేశారు. 2003లో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహద పడిన వ్యక్తి .. రాజశేఖర్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలోనే సంక్షేమం అనే పదానికి పూర్తి చిరునామాగా నిలిచారు. వారి హయాంలో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రియంబర్స్మెంట్, మరి ముఖ్యంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద కాలువల నిర్మాణం చేపట్టి రాష్ట్ర రైతాంగానికి అండగా నిలిచిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.
వారి హయాంలోనే కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ చొప్పదండి నియోజకవర్గంలో జేఎన్టీయూ లాంటి ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పడం ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా నేటికీ కీర్తించబడుతున్నారు. వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఇంకా ఎన్నో సేవలు అందించవలసి ఉండేది కానీ.. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శోకసముద్రంలో ముంచారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి చూపిన పోరాటపటిమను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలను స్మరించుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండీ తాజ్, మడుపు మోహన్, కర్ర సత్య ప్రసన్న, బానోతు శ్రావన్ నాయక్, వెన్న రాజమల్లయ్య, సిరాజ్ హుస్సేన్, సురేందర్ రెడ్డి ముదుగంటి, గంట శ్రీనివాస కళ్యాణి, కాంతాల జగన్ రెడ్డి, చర్ల పద్మ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వంగల విద్యాసాగర్, దిండిగాల మధు, మాదాసు శ్రీనివాస్, కుంభాల రాజు కుమార్, కల్వల రామ్ చందర్, షబానా మహమ్మద్, పోరండ్ల రమేష్, గడప శ్రీనివాస్, మంద మహేష్, శిల్ప, స్వప్నశ్రీ, అందే శంకర్, తోట అంజయ్య, భారీ, మూల కృష్ణారెడ్డి, నూనె గోపాల్ రెడ్డి, మాలోతు మహాలక్ష్మి, హైమద్, మహమ్మద్ చాంద్, గన్ను మహేందర్ రెడ్డి, హనీఫ్, జొన్నల రమేష్, ముక్క భాస్కర్, సత్తినేని శ్రీకాంత్, విక్టర్, శారద, కట్టెకోల ప్రభాకర్, జ్యోతి రెడ్డి, కాంపల్లి కీర్తి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

