కలం, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ చేతిలో ఆఖరి ఓవర్లో ఓటమి పాలైన న్యూజిలాండ్ (New Zealand) జట్టు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠలో ఉంది. శనివారం పల్లెకెలె వేదికగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగనున్న పోరుపైనే కివీస్ సెమీఫైనల్ భవితవ్యం ఆధారపడి ఉండటంతో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ మ్యాచ్ ఫలితం కోసం కివీస్ ఆటగాళ్లంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 18వ ఓవర్ వరకు న్యూజిలాండ్దే పైచేయిగా ఉంది. చివరి 18 బంతుల్లో ఇంగ్లాండ్కు 43 పరుగులు అవసరమైన దశలో గ్లెన్ ఫిలిప్స్ వేసిన ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. విల్ జాక్స్, రెహన్ అహ్మద్ జోడీ ఆ ఓవర్లో ఏకంగా 22 పరుగులు రాబట్టడంతో కివీస్ చేతుల్లోంచి విజయం చేజారింది. ఆఖరి నిమిషం వరకు మ్యాచ్ నియంత్రణలోనే ఉన్నా, చిన్న చిన్న పొరపాట్ల వల్ల సెమీస్ అవకాశాన్ని స్వయంగా సంక్లిష్టం చేసుకున్నామని సాంట్నర్ అంగీకరించారు.
ఇంగ్లాండ్ బ్యాటర్లు వ్యూహాత్మకంగా ఆడటం వల్లే తాము ఓడిపోయామని సాంట్నర్ అభిప్రాయపడ్డారు. కివీస్ బ్యాటర్లు స్క్వేర్ దిశగా షాట్లు ఆడితే, ఇంగ్లాండ్ బ్యాటర్లు స్ట్రెయిట్ షాట్లతో విరుచుకుపడ్డారని ఆయన పేర్కొన్నారు. బౌలింగ్ అమలులో లోపాలు, ఫీల్డింగ్ వైఫల్యాలు కూడా ప్రభావం చూపాయని తెలిపారు. గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఇప్పుడు ఫలితం తమ చేతుల్లో లేదని ఆయన వ్యాఖ్యానించారు. హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్కు చేరుకుంది. రెండో స్థానం కోసం ఇప్పుడు గట్టి పోటీ నెలకొంది. శ్రీలంక గనుక పాకిస్థాన్ను ఓడిస్తే న్యూజిలాండ్ (New Zealand) నేరుగా సెమీస్కు వెళ్తుంది. అలా కాకుండా పాకిస్థాన్ భారీ తేడాతో గెలిచి రన్ రేట్లో కివీస్ను దాటేస్తే మాత్రం పాక్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. దీనిపై స్పందిస్తూ.. రేపటి మ్యాచ్ చూస్తున్నప్పుడు తమలో టెన్షన్ నెలకొంటుందని, తాము భారత్ వెళ్తామో లేక ఇంటికి వెళ్తామో ఆ మ్యాచ్ ఫలితమే నిర్ణయిస్తుందని సాంట్నర్ స్పష్టం చేశారు.

