కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం 16వ రోజుకు చేరుకున్నది. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మీడియా ముందుకు రాలేదు. అతడికి సంబంధించిన వీడియోలు కూడా ప్రసారం కావడం లేదు. దీంతో నెతన్యాహుకు ఏమైంది? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా కనిపించడం లేదు. దీంతో ఈ ఇద్దరూ చనిపోయారంటూ సోషల్ మీడియాలో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ కు వెళ్లారా? లేదంటే గాయపడి చికిత్స పొందుతున్నారా? అన్న విషయంలోనూ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రెయల్ ప్రభుత్వం మాత్రం నెతన్యాహు బతికే ఉన్నాడని ప్రకటించింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ’పిల్లలను హత్య చేసిన నేరస్థుడు ఇంకా బతికే ఉంటే అతన్ని వెంబడించి హతమారుస్తాం” అని పేర్కొంది. మార్చి 12న నెతన్యాహుకు సంబంధించిన ఓ వీడియో విడుదలైంది. ఆ వీడియోలో అతని చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించిందని కొందరు పేర్కొంటూ, ఆ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘కొత్త సుప్రీం లీడర్ను చంపేస్తాం‘
ఆ వీడియోలో 76 ఏళ్ల నెతన్యాహు, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై ప్రారంభించిన వైమానిక దాడుల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఆ దాడుల తర్వాత పరిస్థితులపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లోని కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని చంపేస్తామంటూ పరోక్షంగా హెచ్చరించారు. “ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తున్నాం. అయితే ప్రజలే ఆ ప్రభుత్వాన్ని లోపల నుంచే కూల్చాలి” అని ఆయన హెబ్రూ భాషలో వ్యాఖ్యానించారు.
నెతన్యాహు ఎక్కడ?
నెతన్యాహు కనిపించకపోవడంపై అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత Candace Owens కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. “నెతన్యాహు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు అతని కార్యాలయం నకిలీ ఏఐ వీడియోలను విడుదల చేసి తొలగిస్తోంది? వైట్ హౌస్లో ఎందుకు ఆందోళన కనిపిస్తోంది?” అంటూ ఆమె సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నెతన్యాహు స్వయంగా లేదా ఆయన సన్నిహితులు అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో అతని కుమారుడు Yair Netanyahu కూడా సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా కనిపించకపోవడం చర్చకు దారితీసింది. మార్చి 9 తర్వాత అతను ఎలాంటి పోస్టులు చేయలేదు. నెతన్యాహు, మొజ్తాబా ఖమేనీ ఇద్దరి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

