కలం, వెబ్ డెస్క్ : నేపాల్ వరదల్లో (Nepal Floods) మృతుల సంఖ్య 768కి చేరుకుంది. ఈ వివరాలను నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా నేపాల్ లో 734 మందికి పైగా చనిపోగా.. టిబెట్ లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. వరదల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇంకా వేలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
వేలాది మంది గల్లంతు
భోటేకోషి నది వరద కారణంగా 2,500 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం.. గల్లంతైన వారిలో పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. నేపాల్ వరదల్లో 287 మంది భారత పర్యాటకుల ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. గల్లంతైన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 13 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు నేపాల్ ఆర్మీ భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 8,186 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.వరదల ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి ప్రాజెక్టులో భాగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు, భద్రతా బలగాలు, రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
నేపాల్కు మరో ముప్పు.. మళ్లీ వరద హెచ్చరికలు
ఇప్పటికే భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్కు మరో ముప్పు పొంచి ఉంది. భోటేకోషి నదిలో నీటిమట్టం మరోసారి భారీగా పెరుగుతున్నట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. నదిలో నీటిమట్టం పెరుగుతున్నట్లు సూచించే శబ్దాలను గుర్తించినట్లు పేర్కొంది. భోటేకోషి నదిలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నదులు ఉప్పొంగి, పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత విషమించే అవకాశం కనిపిస్తోంది.

