కలం, తొర్రూర్: తొర్రూర్ డివిజన్లోని గోపాలగిరి గ్రామంలో ఏర్పాటు చేస్తామన్న రూ.100 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) డిమాండ్ చేశారు. ఆదివారం తొర్రూర్ మార్కెట్లో ఆయిల్ పామ్ గెలలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైందని, దీంతో వేలాది మంది రైతులు పంటను దూర ప్రాంతాలకు తరలించి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే స్థానికంగానే మార్కెటింగ్ సౌకర్యం కలుగుతుందని ఎర్రబెల్లి తెలిపారు. నర్సరీల్లో నాణ్యత లేని, వయసు దాటిన మొక్కలను పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే నాణ్యమైన మొక్కలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులవుతున్నా రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు.

