కలం, వెబ్ డెస్క్ : నేపాల్లోని కావ్రేపలాంచోక్ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం (Nepal Bus Accident) చోటుచేసుకుంది. కొండ ప్రాంత రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి, సుమారు రెండు వందల మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం ఇరవై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ భీకర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన పదహారు మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. స్థానిక అధికారులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించారు. ప్రస్తుతం గాయపడిన వారికి సమీప ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో ఉండే ప్రమాదకరమైన మలుపులు, రహదారి పరిస్థితులే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

