కలం, వెబ్డెస్క్: జమ్మూ కశ్మీర్ను పాకిస్థాన్లో భాగంగా చూపుతూ విడుదల చేసిన నెట్ వర్క్ మ్యాప్పై నేపాల్ ఎయిర్లైన్స్ (Nepal Airlines) ఎట్టకేలకు భారత్కు క్షమాపణలు చెప్పింది. ఇటీవల నేపాల్ ఎయిర్ లైన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ నెట్ వర్క్ మ్యాప్ అంతర్జాతీయ స్థాయిలో వివాదానికి దారి తీసింది. కశ్మీర్ను పాక్లో అంతర్భాగంగా చూపించిన ఈ మ్యాప్పై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మ్యాప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాయ్ కాట్ నేపాల్ ఎయిర్ లైన్స్ అనే హ్యాష్ట్యాగ్తో భారతీయుల నిరసన తీవ్రరూపం దాల్చింది. దీనిపై కొందరు భారతీయ నటులు సైతం స్పందించారు. ఇది నేపాల్ రెచ్చగొట్టేందుకే చేసిన చర్యలుగా అభివర్ణించారు.
ఇక సదరు మ్యాప్పై తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో నేపాల్ ఎయిర్లైన్స్ 24 గంటలలోపే ఆ వివాదాస్పద పోస్ట్ను తొలగించి బహిరంగ క్షమాపణలు చెప్పింది. మ్యాప్లో జరిగిన తప్పు కేవలం సాంకేతిక లోపమని, అది నేపాల్ ప్రభుత్వ అధికారిక వైఖరి కాదని స్పష్టం చేసింది. పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలను తాము ఎంతో గౌరవిస్తామని, ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించామని విమానయాన సంస్త ప్రతినిధులు వెల్లడించారు. నేపాల్లో ఇటీవల బాలేంద్ర షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న కొన్ని ఘటనలు భారత్ను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి. నేపాల్ సరిహద్దులో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

