కలం, వెబ్ డెస్క్ : శంషాబాద్ మండలం బహదూర్ గూడ భూవివాదంలో (Bahadurguda Land Issue) రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భూమి స్వాధీనానికి సంబంధించిన వివాదంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మొత్తం 650 ఎకరాల భూమిపై స్టేటస్ కో విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా భూమిలో (Bahadurguda Land Issue) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను వెంటనే తొలగించాలని హైడ్రా (HYDRAA), రెవెన్యూ శాఖ అధికారులను న్యాయస్థానం (Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ భూమిలో ఎలాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది.
కాగా, సోమవారం ఇదే కేసులోని కొన్ని సర్వే నంబర్లకు సంబంధించిన 28 ఎకరాల భూమికి మాత్రమే హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. అయితే, మంగళవారం జరిగిన విచారణలో ఉపశమనాన్ని విస్తరించి, మొత్తం 650 ఎకరాల భూమికి స్టేటస్ కో వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో బహదూర్గూడ భూముల వ్యవహారంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడగా, తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.

