కలం, స్పోర్ట్స్ : 90 మీటర్ల మార్క్ను దాటిన త్రో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినా, అది తన అత్యుత్తమ ప్రదర్శన కాదని భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) వెల్లడించాడు. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీడియా సమావేశంలో అతను ఈ విషయాన్ని చెప్పాడు. గత సీజన్లో దోహా డైమండ్ లీగ్లో నీరజ్ తొలిసారి 90 మీటర్ల అవరోధాన్ని అధిగమించాడు. అయితే ఆ త్రో వీడియోను తాను ఎక్కువసార్లు చూడనని తెలిపాడు. సాంకేతికంగా అది అంత గొప్ప త్రో కాదని, చేతి నుంచి వేగంగా విడుదలైనప్పటికీ కింది భాగం కదలికలు పూర్తిగా సరిగా లేవని వివరించాడు.
ఆ అంశంలో మెరుగుదల ఉంటే మరో రెండు నుంచి మూడు మీటర్లు అదనంగా వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నాడు. ఫైనల్స్ కంటే క్వాలిఫికేషన్ రౌండ్లో చేసిన త్రోలను చూడటానికే ఎక్కువ ఇష్టపడతానని నీరజ్ చెప్పాడు. ఆ సమయంలో తాను ప్రశాంతంగా ఉంటానని, టెక్నిక్ కూడా మెరుగ్గా ఉంటుందని తెలిపాడు. ఫైనల్స్లో మాత్రం ఎక్కువగా ప్రయత్నించే క్రమంలో సాంకేతిక అంశాలను మరిచిపోతానని వివరించాడు. దోహా తన కెరీర్లో ప్రత్యేకమైన వేదికగా నిలిచిందని నీరజ్ గుర్తు చేసుకున్నాడు.
అక్కడే 90 మీటర్ల మార్క్ దాటినప్పటికీ, అదే పోటీలో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ తన కంటే ఎక్కువ దూరం త్రో చేశాడని చెప్పాడు. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న వెబర్ విజయంపై కూడా తాను సంతోషించానని తెలిపాడు. కొత్త సీజన్కు సిద్ధమవుతున్న నీరజ్, ఇప్పటికే సాధించిన దూరాల కంటే తన టెక్నిక్ను మరింత మెరుగుపరచడంపైనే దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశాడు.

