కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam)లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శనివారం నుంచి భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు మరొక నూతన డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భద్రాచలం శాఖ సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన సమాచార కేంద్రం వద్ద అత్యాధునిక డిజిటల్ ‘కియాస్క్’ (Digital Kiosk) యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఈ నూతన సాంకేతిక సౌకర్యంతో స్వామివారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు క్యూలైన్ల తిప్పలు తప్పనున్నాయి. భక్తులు గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సిన అవసరం లేకుండానే వివిధ ఆర్జిత సేవల టికెట్లతో పాటు స్వామివారి దివ్య ప్రసాదం టికెట్లను కూడా ఈ కియాస్క్ యంత్రం (Digital Kiosk) ద్వారా స్వయంగా, అత్యంత వేగంగా పొందేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించబడింది.
రామయ్య దర్శనానికి విచ్చేసే భక్తులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలందించడమే లక్ష్యంగా ఈ డిజిటల్ కేంద్రాన్ని రూపొందించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కావున భద్రాద్రికి విచ్చేసే భక్తులందరూ ఈ నూతన కియాస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Also Read : ‘నర్సింగ్ ప్రమోషన్లు తక్షణమే పూర్తి చేయాలి’
Follow Us On : WhatsApp

