కలం, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం (Mylavaram) ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన దుస్థితిపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. కొద్ది రోజులుగా మైలవరం పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని (Midday Meal) డస్ట్ బిన్లో పడేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మేరకు ఒకరు ఎక్స్లో షేర్ చేసిన వీడియోకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో ఆహారం నాణ్యత బాగా లేదన్న విషయం తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు ముందు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించి విచారణ జరిపించినట్లు తెలిపారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆహారం సరఫరా చేసే ఏజెన్సీ మార్చడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన స్కూల్ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణను మరింత కఠినతరం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల నుండి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు లీప్ యాప్ ద్వారా ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. దీంతో స్కూళ్లలో ఏమైనా సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి (Nara Lokesh) విద్యార్థులకు, తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు, పౌష్టికాహారం అందించడమే తమ లక్ష్యమన్నారు. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Read Also: ఆర్సీబీలో వెంకటేశ్ అయ్యర్కు చోటు లేదు : సంజయ్ బంగర్
Follow Us On: Youtube

