కలం, వలిగొండ: ఉచిత బియ్యం పథకం పేరుతో వృద్ధ దంపతులను మోసం చేసి బంగారు మంగళసూత్రాన్ని అపహరించిన ఇద్దరు నిందితులను బీబీనగర్ (Bibinagar) పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 12న బీబీనగర్కు చెందిన వృద్ధ దంపతుల ఇంటికి ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తాము ప్రభుత్వ అధికారులమని, ఉచిత బియ్యం పథకానికి ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉందని నమ్మించారు. ఫొటో తీయాలంటే మెడలోని మంగళసూత్రం తీసేయాలని చెప్పడంతో బాధితురాలు అలాగే తన భర్తకు ఇచ్చింది.
వృద్ధురాలిని తోసేసి..
వెంటనే ఇద్దరు దుండగులు వృద్ధురాలిని తోసేసి భర్త చేతిలోని మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జులై 26న సత్యసాయి జిల్లాకు చెందిన సింహాద్రి గంగాధరప్ప (22), కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాకు చెందిన జంగాల శివరాజ్ (38)ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
నిందితులు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరిపై ఏపీలో పలు కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 30 గ్రాముల బంగారు మంగళసూత్రం, పల్సర్ బైక్, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన బీబీనగర్ ఇన్స్పెక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి, ఎస్సై రమేష్తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ అభినందించారు.

