కలం, కాజీపేట: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కాజీపేట పోలీసులు (Kazipet Police ) మరోసారి తమ నిబద్ధతను చాటుకున్నారు. ప్రమాదవశాత్తు పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ను సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి యజమానికి అప్పగించి పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచారు.
వివరాల్లోకి వెళ్తే.. కాజీపేట డీజిల్ కాలనీకి చెందిన నరేష్ ఇటీవల హనుమకొండలోని జూడియో షోరూమ్కు వెళ్లగా, అక్కడ ప్రమాదవశాత్తు తన బంగారు బ్రాస్లెట్ను పోగొట్టుకున్నారు. ఎంత వెతికినా దొరకకపోవడంతో కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న కాజీపేట సీఐ శ్యామ్ సుందర్ వెంటనే స్పందించి కేసు దర్యాప్తునకు ఆదేశించారు. ఆయన సూచనల మేరకు పోలీసులు జూడియో షోరూమ్తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుటేజీల ఆధారంగా పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం బాధితుడు నరేష్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి, అన్ని వివరాలు ధృవీకరించిన తర్వాత బ్రాస్లెట్ను ఆయనకు అప్పగించారు.
తన విలువైన బంగారు ఆభరణాన్ని తిరిగి అందించిన కాజీపేట సీఐ శ్యామ్ సుందర్తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందికి నరేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడుతూ బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడంలో కాజీపేట పోలీసులు మరోసారి తమ సేవా తత్పరతను నిరూపించుకున్నారని స్థానికులు అభినందించారు.

