కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాండెక్స్ (Yandex) ఉన్నతస్థాయి బృందంతో భేటీ అయ్యారు. రష్యన్ పారిశ్రామికవేత్తలు, మేనేజర్లు, ఫండ్ నిర్వాహకులతో కూడిన కన్సార్టియం ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని నగరం, విశాఖపట్నం ఏఐ డేటా సెంటర్ ప్రాంతాలలో యాండెక్స్ ఆధ్వర్యంలో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ప్రిడిక్టివ్ ట్రాన్సిట్ షెడ్యూలింగ్, అలాగే కంప్యూటరైజ్డ్ పబ్లిక్ సేఫ్టీ అనలిటిక్స్ అమలు చేసే అవకాశాలపై చర్చలు జరిగాయి.
పట్టణ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు లాస్ట్ మైల్ రవాణా ఖర్చులను తగ్గించే సాంకేతిక పరిష్కారాలపై అధ్యయనం చేయాలని యాండెక్స్ బృందానికి మంత్రి సూచించారు. ఏపీలో వేగవంతమైన, డిజిటల్ ఆధారిత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. ఈ భేటీతో ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీలు, ఏఐ ఆధారిత పాలన వ్యవస్థల అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని భావిస్తున్నారు.

