కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాజకీయాల్లో అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో స్వయంగా ప్రధాని తమ ఇంటికి రావడంపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదిక గా పోస్ట్ పెట్టారు. తమ ఇంటికి అతిథిగా వచ్చిన మోదీకి నారా కుటుంబంలోని మూడు తరాల వారు ఆత్మీయ స్వాగతం పలికారని భువనేశ్వరి పేర్కొన్నారు.
తమ ఇంటికి వచ్చిన ప్రధాని ఎంతో ప్రేమ, ఆప్యాయత పంచారన్నారు. అయోధ్యలో శ్రీరాముడిని ప్రతిష్ఠించిన మోదీ చేతుల మీదుగానే మా నాన్న తారక రాముడు ఇచ్చిన శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలకు పూజలు చేసినట్లు చెప్పారు. ప్రజలకు, దేశానికి మంచి జరగాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు నారా భువనేశ్వరి వెల్లడించారు. ఆప్యాయత, ఆతిథ్యం, ఆధ్యాయత్మికత కలబోతగా మోదీ పర్యటన సాగిందన్నారు. ప్రధాని రాక తమ కుటుంబంలోని మూడు తరాల వారికి మరిచిపోలేని జ్ఞాపకాలను అందించింది అని భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు.

