కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండలో అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు (Nalgonda ACB) మరోసారి విరుచుకుపడ్డారు. భూమి సర్వే కోసం లంచం డిమాండ్ చేసిన ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో ల్యాండ్ సర్వేయర్గా పనిచేస్తున్న పవన్ కుమార్ రూ. 15 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నల్లగొండకు చెందిన ఓ బాధితుడు తన భూమికి సంబంధించిన ల్యాండ్ సర్వే కోసం ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆ పని పూర్తి చేయాలంటే తనకు రూ. 35 వేలు లంచం ఇవ్వాలని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్ పవన్ కుమార్ డిమాండ్ చేశాడు
అయితే అంత పెద్ద మొత్తంలో ఇచ్చుకోలేనని బాధితుడు బతిమాలినా అధికారి వినకపోవడంతో చివరకు ఒప్పందం కుదిరింది. ఈ డీల్లో భాగంగా బాధితుడు ఇదివరకే రూ. 20 వేల నగదును పవన్ కుమార్కు అందజేశాడు. మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ రూ. 15 వేలు ఇస్తేనే సర్వే పని ముగుస్తుందని అధికారి ఖరాఖండిగా చెప్పాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఈ విషయమై అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో బాధితుడి నుంచి మిగిలిన రూ. 15 వేల లంచం డబ్బును పవన్ కుమార్ తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పవన్ కుమార్ చేతుల నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, అతడిపై కేసు నమోదు చేశారు. ఆర్డీవో కార్యాలయంలో ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతుండటంతో తోటి ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

