కలం, మిర్యాలగూడ : భూ భారతి కేసుల పరిష్కారంలో భాగంగా నల్లగొండ (Nalgonda) కలెక్టర్ బి.చంద్రశేఖర్ పొలం బాట పట్టారు. గురువారం ఆయన మిర్యాలగూడ మండలం కొత్తగూడెం శివారులోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. మండలంలో ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములపై తహసీల్దార్తో విచారించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భూ భారతి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి తనిఖీ చేసిన తర్వాత తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చట్ట ప్రకారం ప్రభుత్వ భూములను పరిరక్షించడంతోపాటు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల లో సాగు చేసుకుంటున్న రైతులు, కౌలు రైతులు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూభారతి కింద వచ్చిన దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించేందుకు తహసిల్దార్లు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ సూచించారు.


