కలం, నల్లగొండ బ్యూరో: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ (Chandrashekhar) అధికారులను ఆదేశించారు. దేవరకొండ మండలంలోని కొల్లిముంతల పహాడ్ గ్రామంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ప్రతి గదిని పరిశీలిస్తూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు సక్రమంగా పనిచేస్తూ విద్యార్థులకు తగిన వెలుతురు అందేలా చూడాలని ప్రిన్సిపాల్కు సూచించారు. అలాగే డోర్లు, కిటికీలు బాగుండేలా చూసుకోవాలని, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. డైనింగ్ హాల్ను పరిశీలించిన ఆయన, భోజనశాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా తరచుగా శుభ్రపరచాలని సూచించారు.
ఆహారం నాణ్యతపై ఆరా..
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని ఆదేశించారు. స్టోర్ రూమ్ను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఆహార పదార్థాల నిల్వ, నాణ్యతపై ప్రశ్నించి.. నిర్వహణ సరిగ్గా ఉండాలని తెలిపారు. వంటగదిలో తయారవుతున్న భోజనాన్ని పరిశీలించారు. ప్రధానంగా చికెన్ ఎప్పుడు తెచ్చారు..? ఎలా వండుతున్నారు..? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి, వారి ఆరోగ్యం, వసతి పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. దేవరకొండ ఆర్డిఓ (RDO) రమణారెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆర్సీఓ (RCO) స్వప్న, దేవరకొండ తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సాగర్, ఎంపీడీవో (MPDO) పార్వతి, సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.

