కలం, వెబ్ డెస్క్ : టెస్టుల్లో పింక్ బాల్ ట్రైల్స్కు ఐసీసీ (ICC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెస్ట్ మ్యాచ్ల సమయంలో తరచూ వెలుతురు లేమి (మసక చీకటి) కారణంగా ఆట ఆగిపోవడాన్ని అడ్డుకోవడానికి, ఇకపై అన్ని టెస్టుల్లోనూ ప్రయోగాత్మకంగా పింక్ బాల్ (గులాబీ రంగు బంతి) వాడకాన్ని పరిశీలించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సరికొత్త నిర్ణయం వల్ల మ్యాచ్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా సాగే అవకాశం ఉంటుంది.
అయితే ఇరు జట్ల ముందస్తు అంగీకారం ఉంటేనే ఈ పింక్ బాల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ సమావేశంలో ఐసీసీ మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. బౌలర్లు నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నారా లేదా అని పరిశీలించేటప్పుడు మ్యాచ్ అధికారులు ‘హాక్-ఐ’ డేటాను ఉపయోగించుకునేందుకు కూడా బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తక్కువ వెలుతురు వల్ల సమయం వృధా కాకుండా చూసేందుకు, మ్యాచ్ అధికారులు, వేదికల కోసం సరికొత్త లైటింగ్ టెక్నాలజీపై మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC)తో కలిసి ఐసీసీ పరిశోధనలు చేయనుంది.
వీటితో పాటు ఆట మధ్యలో నిర్ణీత డ్రింక్స్ విరామ సమయంలో హెడ్ కోచ్ లేదా జట్టు ప్రతినిధి మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి లభించింది. ఇక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో 15 నిమిషాల విరామాన్ని తప్పనిసరి చేయడంతో పాటు, విరామం ముగిసి మళ్లీ ప్రారంభమయ్యే సమయానికి బ్యాటర్లు క్రీజులో సిద్ధంగా ఉండాలనే నిబంధనను కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా లెగ్సైడ్ వైడ్ల ట్రయల్ను శాశ్వతంగా అమలు చేయాలని, సిడబ్ల్యుసి (CWC) ఛాలెంజ్ లీగ్లోని జట్లు ఇతర లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడేందుకు అర్హత కలిగి ఉంటాయని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ సరికొత్త నిబంధనల మార్పులు భవిష్యత్తులో క్రికెట్ ఆటను మరింత వేగంగా, ఆసక్తికరంగా మారుస్తాయని భావిస్తున్నారు.

