కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) పట్టణంలోని సూర్యవంశీ కాలనీలో ఒకే ఇంట్లో తండ్రి, కొడుకులు విగతజీవులుగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. మృతులను విద్యుత్ శాఖలో లైన్మ్యాన్గా పనిచేస్తున్న పబ్బత్తి రెడ్డి లింగారెడ్డి, ఆయన చిన్న కుమారుడు ప్రణీత్ రెడ్డి (9వ తరగతి)గా గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. లింగారెడ్డి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో, భార్య, పెద్ద కుమారుడు బయటకు వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి.. ఇంట్లో భర్త లింగారెడ్డి, కొడుకు ప్రణీత్ రెడ్డి ఇద్దరూ రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తుండగా, 9వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడు ప్రణీత్ రెడ్డి తలపై మాత్రం బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఒక సుత్తె దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తండ్రే కొడుకు తలపై సుత్తెతో బాది, ఆ తర్వాత తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక దీని వెనుక మరేదైనా కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తండ్రీకొడుకుల మృతిపై అన్ని కోణాల్లోనూ లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

