కలం, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత జట్టుపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) కీలక అంచనా వేశారు. ప్రస్తుత భారత టీ20 జట్టు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటని ఆయన చెప్పారు. మహీ అన్ప్లగ్డ్లో మాట్లాడిన ధోని, జట్టుకు కావాల్సిన ప్రతీ అంశం ఇప్పటికే సిద్ధంగా ఉందని తెలిపారు. అనుభవం బలంగా ఉందని, ఆటగాళ్లకు తమ పాత్రలపై స్పష్టత ఉందని పేర్కొన్నారు. ఒత్తిడిలో ఆడిన అనుభవమే ఈ జట్టును ప్రత్యేకంగా నిలబెడుతోందని ఆయన (MS Dhoni) అభిప్రాయపడ్డారు.
అయితే, ఒక అంశం మాత్రం తనను ఇప్పటికీ ఆందోళనకు గురిచేస్తుందని ధోని చెప్పారు. అదే డ్యూ.. డ్యూ కారణంగా మ్యాచ్ స్వరూపం మారిపోతుందని, టాస్ కీలకంగా మారుతుందని వివరించారు. పరిస్థితులు సమానంగా ఉంటే భారత్ ఎక్కువసార్లు విజయం సాధిస్తుందని తెలిపారు. టీ20 ఫార్మాట్లో అనిశ్చితి సహజమని ధోని గుర్తు చేశారు. ఒకరోజు ఆటగాళ్లకు ఫామ్ లేకపోవడం, ప్రత్యర్థి ఆటగాడు మెరవడం వల్ల పరిస్థితి మారుతుందని చెప్పారు. ఇది లీగ్ దశలోనైనా, నాకౌట్లోనైనా జరగవచ్చని అన్నారు.
అందుకే గాయాలు లేకుండా, అందరూ తమ పాత్రలను సరిగ్గా నిర్వర్తించడమే ముఖ్యమని ధోని తెలిపారు. ఎలాంటి అపశకునం తేవాలనుకోవడం లేదని చెబుతూ, అయినప్పటికీ ఈ జట్టు అత్యంత ప్రమాదకరమనే అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేశారు. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ను భారత్కు అందించిన కెప్టెన్ ధోనినే. 2024లో రోహిత్ శర్మ జట్టు ఆ విరామాన్ని ముగించింది. ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ స్వదేశంలో టైటిల్ను కాపాడనుంది.


