కలం, ఖమ్మం బ్యూరో: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో ప్రయాణీకుల సౌకర్యార్థం పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని ఆయనకి వద్దిరాజు విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రబలిన సమయంలో రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను కూడా పునరుద్ధరించాలని రైల్వే మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం గయా మాస్, స్వర్ణ జయంతి, జైపూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఖమ్మం స్టేషన్లో నిలిపేవిధంగా అధికారులకు వెంటనే తగు ఆదేశాలివ్వాల్సిందిగా కోరారు. అలాగే శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మంలో కేరళ ఎక్స్ ప్రెస్కు హాల్టింగ్ సదుపాయం కల్పించాల్సిందిగా వినతిపత్రంలో పేర్కొన్నారు. గార్ల రైల్వే స్టేషన్లో శాతవాహన, ఇంటర్ సీటీ రైళ్లను ఆపడంతోపాటు స్టేషన్ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి చేశారు.
రద్దు చేసిన రైళ్లను పునరుద్దరించండి…
కరోనా సమయంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రద్దు చేసిన కాజీపేట – విజయవాడ, డోర్నకల్ – భద్రాచలం, కాజీపేట – మణుగూరు, కొల్లాపూర్ ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించాలని, కాకతీయ ప్యాసింజర్ రైలుకు తడికలపూడి, చీమలపాడు, బేతంపూడి స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించాలని వినతి పత్రంలో ఎంపీ రవిచంద్ర (Vaddiraju Ravichandra) పేర్కొన్నారు. కాజీపేట-విజయవాడ ప్యాసింజర్ రైలును భక్తుల సౌకర్యార్థం తిరుపతి వరకు పొడిగించాలని, కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కు ఉదయం పూట మరో రైలును ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీ రవిచంద్ర కోరారు. ఎంపీ వినతిపై రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.
Read Also: పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట
Follow Us On: X(Twitter)


