కలం, వెబ్ డెస్క్ : శ్రీశైలం (Srisailam) పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో రెండు చిరుత పులులు సంచరించడం తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో కళాశాల ఆవరణలోకి ప్రవేశించిన ఈ పులులు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ సమయంలో విధుల్లో ఉన్న వాచ్మెన్ను గమనించిన చిరుతలు లోపలికి రాకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాయి. ప్రస్తుతం కళాశాలకు సెలవులు ఉండటంతో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బంధించి అడవిలోకి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

