కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Vamsi Krishna), బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చకు వచ్చిన బిల్లుకు, తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలకు అసలు సంబంధమే లేదని, ఆయన మతి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను అవమానిస్తుంటే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు అడ్డుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమని, ప్రధాని మోడీతో సహా పలువురు నేతలు గతంలోనూ తెలంగాణ ఏర్పాటును కించపరిచారని గుర్తుచేశారు. హత్రాస్, ఉన్నావ్ వంటి ఘటనల్లో నిందితులను బీజేపీ ప్రోత్సహించిందని ఆరోపించారు.
రేపిస్టులకు టికెట్లు ఇచ్చి పార్టీ మహిళల హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేవలం టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను తెచ్చింది, దాని కోసం పోరాడింది , ప్రస్తుతం అభివృద్ధి చేస్తోంది కేవలం కాంగ్రెస్ పార్టీయే అని వంశీకృష్ణ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని ఆయన తేల్చి చెప్పారు. “తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించే ప్రసక్తే లేదు” అని ఎంపీ వంశీకృష్ణ హెచ్చరించారు.

