కలం, నిజామాబాద్ బ్యూరో : ఎరువుల యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తీసేయాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) డిమాండ్ చేశారు.. అది పనికి మాలిన యాప్ అంటూ అభివర్ణించారు. రోజూ తనకు తన కాల్ సెంటర్ కు రైతుల నుంచి విపరీతంగా ఫోన్ లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. మంత్రి తుమ్మల పనికి మాలిన యాప్ ను తీసుకొచ్చారని అరవింద్ మండిపడ్డారు. కమీషన్ కోసం ఇలాంటి యాప్ ను తెచ్చినట్టున్నారని ఆయన ఆరోపించారు.
వెంటనే యాప్ ను తొలగించి పాత పద్ధతిలోనే ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలాంటి యాప్లు తీసుకొచ్చే ఉద్దేశ్యం ఉంటే ముందు ఒక మండలంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సక్సెస్ అయితే రాష్ట్రంలో అమలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతే కానీ ఏది పడితే అది రైతులకు రుద్దుతాం అంటే కుదరదని ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు FCI కి బాకీ పడ్డ 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించి.. ఆ తర్వాత కిషన్ రెడ్డి ఇంటి ముందు.. తన ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు.

