కలం, నిజామాబాద్ బ్యూరో: ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ పెగుబంధం మరిచింది. కన్న బిడ్డలను వదిలించుకోవాలని చూసింది. చివరకు పోలీసులు తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను ఆమెకు అప్పగించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామానికి చెందిన లక్ష్మి తన ఇద్దరు కూతుర్లు గంగోత్రి (10వ తరగతి), హాసిని (2వ తరగతి)ని తీసుకుని బాన్సువాడ (Banswada) ఆస్పత్రికి వచ్చింది.
ఆస్పత్రి ప్రాంగణంలో ఇద్దరు చిన్నారులను కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయింది. రాత్రయినా తల్లి రాలేదు. చిన్నారులిద్దరూ ఆస్పత్రి ఆవరణలోనే అటూ ఇటు తిరుగుతుండటం గమనించి సిబ్బంది సుపరింటెండెంట్ విజయభాస్కర్కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఆ చిన్నారులకు ఓ గదిలో వసతి కల్పించి మూడు రోజులు భోజన ఏర్పాట్లు చేశారు. రోజులు గడుస్తున్నా తల్లి రాకపోవడంతో చివరకు పోలీసులకు సమాచారం అందించి.. ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. చివరికి పోలీసులు తల్లిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లల్ని అప్పగించారు. భర్త చనిపోవడంతో పిల్లల పోషణ భారంగా మారి ఆ తల్లి ఇలా చేసినట్టు సమాచారం. తమ తండ్రి చనిపోయాడని చిన్నారులు అధికారులకు వివరించారు.
Read Also: యూసీసీ బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం
Follow Us On: Instagram

