కలం, వెబ్ డెస్క్: ప్రతిష్టాత్మక ఐజీపీఎల్ భారత్ క్లాసిక్ గల్ఫ్ టోర్నీకి మొరాకో (Morocco) వేదికగా సర్వం సిద్ధమైంది. ఐజీపీఎల్ టూర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఈవెంట్లో అత్యధిక ఏషియన్ టూర్ టైటిళ్లు సాధించిన భారత స్టార్ గల్ఫర్ గగన్జీత్ భుల్లర్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. గత ఏడాది ఈ టోర్నీ మొదటి ఎడిషన్ను భారత్లోని కెన్స్ విల్లే గల్ఫ్ రిసార్ట్లో విజయవంతంగా నిర్వహించగా, ఈసారి మొరాకోలోని అట్లాంటిక్ తీరంలో ఉన్న ప్రసిద్ధ మజాగాన్ బీచ్ అండ్ గల్ఫ్ రిసార్ట్లో నిర్వహిస్తున్నారు. 5 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ గల ఈ ఈవెంట్లో ఐజీపీఎల్ టూర్ నుండి 40 మందికి పైగా ఆటగాళ్లు అర్హత సాధించారు. భారత్, ఏషియన్ గల్ఫ్ క్యాలెండర్లో ఎంతో ముఖ్యమైన ఈ టోర్నీలో గెలిచిన వారికి ప్రధాన టూర్కు పూర్తి స్థాయి కార్డ్తో పాటు ఇంటర్నేషనల్ సిరీస్లలో ఆడే అవకాశాలు లభిస్తాయి.
ఈ టోర్నీ గత ఏడాది కాలక్రమంలో ఎందరో ఆటగాళ్లకు మంచి అవకాశాలను కల్పించింది. 2025 ఆర్డర్ ఆఫ్ మెరిట్ విజేత పుఖ్రాజ్ సింగ్ గిల్ ఈ టోర్నీ ద్వారానే ఇంటర్నేషనల్ సిరీస్లోకి అడుగుపెట్టారు. వచ్చే వారం జరగబోయే 20 లక్షల డాలర్ల మెగా ఈవెంట్లోనూ ఆయన పెద్ద పెద్ద ఆటగాళ్లతో కలిసి ఆడనున్నారు. భుల్లర్ తన చివరి ఏషియన్ టూర్ టైటిల్ను 2023 నవంబర్లో గెలుచుకున్నారు. ఆ తర్వాత సుమారు 30 నెలలుగా ఆయనకు ఏషియన్ టూర్ విజయం దక్కలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఐజీపీఎల్ టూర్లో నాలుగు సార్లు విజేతగా నిలిచారు. ఇందులో చివరి విజయం మార్చి నెలలో చండీగఢ్లో నమోదైంది. ఈసారి భుల్లర్తో పాటు పుఖ్రాజ్ గిల్, కరన్దీప్ కొచ్చర్, ఉదయన్ మానే, యువ ఆటగాడు కార్తీక్ సింగ్, అమన్ రాజ్ వంటి ఇతర ప్రముఖ భారత గల్ఫర్లు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఈ టోర్నీలో భారతీయులతో పాటు అంతర్జాతీయ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇటీవల తైవాన్ ఓపెన్ గెలిచి, ప్రస్తుత ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మూడో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఆటగాడు ఇయాన్ స్నిమన్ మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో నాలుగో స్థానంలో ఉన్న థాయ్లాండ్కు చెందిన పవిత్, కొరియా ఓపెన్లో రన్నరప్గా నిలిచిన స్వీడన్ ఆటగాడు చార్లీ లింద్, న్యూజిలాండ్ పీజీఏ ఛాంపియన్షిప్ విజేత ఆస్టెన్ ట్రస్లో కూడా ట్రోఫీ రేసులో ఉన్నారు. వీరితో పాటు 2019 ఆర్డర్ ఆఫ్ మెరిట్ విజేత జాజ్ జనేవట్టనానోండ్, గత వారం ఏషియన్ డెవలప్మెంట్ టూర్లో గెలిచిన తనపట్ పిచాయికుల్ కూడా మొరాకోలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాది గుజరాత్లో జరిగిన టోర్నీలో థాయ్లాండ్కు చెందిన పూసిత్ సుపుప్రామై విజేతగా నిలిచారు. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆయన ఈ వారం తన టైటిల్ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఈ టోర్నీ మొత్తం 144 మంది ఆటగాళ్లతో ప్రారంభం కానుంది. మొదటి 36 హోల్స్ తర్వాత కట్ ఆఫ్ విధించబడుతుంది. అందులో మొదటి 65 స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు మాత్రమే చివరి రెండు రౌండ్లలో ఆడేందుకు అర్హత సాధిస్తారు. తొమ్మిది సార్లు మేజర్ ఛాంపియన్గా నిలిచిన గ్యారీ రూపొందించిన ఈ అద్భుతమైన కోర్సులో ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉండబోతుందో, ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను ఎవరు కైవసం చేసుకుంటారో వేచి చూడాలి.

